- మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించేందుకు నిరాకరించిన రాహుల్ గాంధీ
- సరైన సమయం రాకుండా తాను వ్యాఖ్యానించలేనని వెల్లడి
- నేడు లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి
మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాకరించారు. ఈ బిల్లుకు మీరు మద్దతిస్తారా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. సరైన సమయం రాకుండా దీనిపై తాను వ్యాఖ్యానించలేనన్నారు. మంగళవారం పార్లమెంట్ వెలుపల ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీ శక్తి వందన్గా నామకరణం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేన్ల అమలు ఉండనుంది. ఈ బిల్లుపై రేపు లోక్ సభలో, ఎల్లుండి రాజ్యసభలో చర్చ జరగనుంది.
తెలంగాణ అమరుల త్యాగాలను మోదీ హేళన చేస్తూ మాట్లాడారు: రాహుల్ గాంధీ
- కొనసాగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
- నిన్న తొలిరోజున పార్లమెంటులో రాష్ట్ర విభజనపై మోదీ వ్యాఖ్యలు
- ఏపీ, తెలంగాణ విభజన సరిగా జరగలేదని వ్యాఖ్య
- మోదీ వ్యాఖ్యలను ఖండించిన రాహుల్ గాంధీ
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తొలి రోజున ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఏపీ, తెలంగాణ విభజన సరిగా జరగలేదని మోదీ అన్నారు. తెలంగాణను రాష్ట్రంగా ప్రకటించే సమయంలో ఇరు రాష్ట్రాల్లో రక్తపాతం జరిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినా ఎక్కడా సంతోషం అనేది లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. మోదీ వ్యాఖ్యలు తెలంగాణను కించపరిచేలా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ అమరులను, వారి త్యాగాలను మోదీ హేళన చేస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. ఇది తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమేనని ధ్వజమెత్తారు.