Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ఇజ్రాయెల్ దాడులకు భయపడకుండా బీరుట్ వరకు విమానం నడిపిన ఇరాన్ పార్లమెంటు స్పీకర్!

  • లెబనాన్, ఇరాన్ పై కారాలుమిరియాలు నూరుతున్న ఇజ్రాయెల్
  • లెబనాన్ రాజధాని బీరుట్ పై ఎడతెగని దాడులు
  • ప్రత్యేక విమానానికి పైలెట్ గా వ్యవహరించిన ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఖలిబాఫ్

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇప్పుడు మరిన్ని దేశాలకు విస్తరించింది. లెబనాన్, ఇరాన్ కూడా ఇజ్రాయెల్ అంటే భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోగా, పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. 

ఈ నేపథ్యంలో, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాకర్ ఖలిబాఫ్ సాహసం చేశారనే చెప్పాలి. ఆయన స్వయంగా విమానం నడుపుతూ లెబనాన్ రాజధాని బీరుట్ చేరుకున్నారు. ఓవైపు ఇజ్రాయెల్ బీరుట్ నగరంపై ఎడతెగని దాడులు చేస్తున్నప్పటికీ భయపడకుండా… మహ్మద్ ఖలిబాఫ్ ఓ విమానానికి పైలెట్ గా వ్యవహరించారు. తన విమానాన్ని బీరుట్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.

మహ్మద్ ఖలిబాఫ్ గతంలో ఇరాన్ వాయుసేన పైలెట్ గా పనిచేశారు. తాజాగా లెబనాన్ పార్లమెంటు స్పీకర్, షియా పార్టీ అమాల్ అధినేత నబీ బెర్రీ ఆహ్వానం మేరకు ఆయన ప్రత్యేక విమానంలో బీరుట్ చేరుకున్నారు. 

బీరుట్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖొమేనీ, ఇరాన్ ప్రభుత్వ పెద్దలు, ఇరాన్ ప్రజల నుంచి సందేశాన్ని తీసుకువచ్చానని, లెబనాన్ ప్రభుత్వ పెద్దలను కలిసి ఆ సందేశాన్ని తెలియజేస్తానని వెల్లడించారు. ఇరాన్ ప్రభుత్వం, ప్రజానీకం యావత్తు లెబనాన్ కు సంఘీభావం తెలుపుతోందని ఖలిబాఫ్ స్పష్టం చేశారు. లెబనాన్ ప్రభుత్వానికి, ప్రజలకు, ప్రతిఘటన దళాలకు ఇరాన్ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. 

ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాక లెబనాన్ ను సందర్శించిన ఇరాన్ నేతల్లో పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాకర్ ఖలిబాఫ్ రెండో వ్యక్తి. ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి లెబనాన్ లో పర్యటించి, చర్చలు జరిపారు.

Related posts

గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి ఏడాది.. వైట్‌హౌస్ వద్ద నిరసన తెలుపుతూ నిప్పుపెట్టుకున్న జర్నలిస్ట్..

Ram Narayana

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

Ram Narayana

విద్యార్థి నేతలకు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు

Ram Narayana

Leave a Comment