రొట్టమాకురేవు కవిత్వఅవార్డు గురించి…కవి యాకుబ్ మాటల్లో …
కవిత్వంలోని వేర్వేరు తరాలను కలిపే వాహికగా కవిసంగమం నిలిచింది. దీనికి ఇంకొంత కొనసాగింపు రొట్టమాకురేవు అవార్డు. కవిసంగమానికి కొనసాగింపని మాత్రమే అనుకుంటే ఈ అవార్డును గురించి దాని అస్తిత్వాన్ని గురించి కొంత తప్పుగా అర్థం చేసుకున్నట్టే. రెంటికీ యాకూబ్ కేంద్రం అవడం వల్ల ఈ ఆలోచన వస్తుంది. కాని కవిత్వానికి దన్నుగా నిలవడానికి ఈ రెండూ రెండు పార్శ్వాలు. ఊరును గురించి తపనపడే వాళ్ళకు ఊరు కేవలం ఒక మొదటి అడుగు మాత్రమే కాదు.
తొలి అడుగునుంచి, తొలిదశనుంచి కూడదీసుకున్న బలం, తనకోసం తనతో పాటూ కన్నీళ్ళు కార్చిన, తనతో పాటు నవ్విన కొన్ని గొంతుకల ఉనికి. ఇంత ప్రపంచాన్ని అంతో ఇంతో చదవడానికి అక్షరాలు దిద్దిన నేల.
రొట్టమాకురేవు యాకూబ్కూ, తన తండ్రి ఒడి శిలాలోలితకూ ఇలాంటిదే. అందుకనే ఈ అవార్డులకు కొంత పురిటివాసన ఉంటుంది.
తనను కన్నతండ్రి షేక్ మహమ్మద్ మియా అవార్డు. తనకు జీవితంపై భరోసానిచ్చిన వ్యక్తి కె.ఎల్.నరసింహా రావు అవార్డు. తనతో జీవితాన్ని పంచుకుని నడుస్తున్న సహచరి శిలాలోలిత తన తండ్రిపేరిట ఇచ్చే పురిటిపాటి రామిరెడ్ది అవార్డు. ఈ అవార్డుల పూర్తి చిరునామా “రొట్టమాకు రేవు అవార్డు” వీటిని విభజించుకోవడంలోనూ ఒక పద్ధతి ఉంది.
షేక్ మహమ్మద్ మియా అవార్డును తనదైన ముద్రగల ఒక సీనియర్ కవికి,
పురిటిపాటి రామిరెడ్ది అవార్డు స్త్రీజీవితాన్ని చిత్రిస్తున్న ఒక స్త్రీమూర్తి కవయిత్రికి,
కె.ఎల్.నరసింహా రావు అవార్డు కొత్తగొంతుకలకు ఇస్తున్నారు. కె.ఎల్ అవార్డు రెండు కొత్తగొంతుకలకు ఇవ్వడం జరుగుతోంది. ఈ అవార్డు 2014 వ సంవత్సరం ప్రారంభమయ్యింది.