100 పూర్తీ చేసుకున్న మెదక్ చర్చికి దేశస్థాయిలో గుర్తింపు ..సీఎం రేవంత్ రెడ్డి
వందేళ్లు పూర్తిచేసుకున్న మెదక్ చర్చికి దేశస్థాయిలో గుర్తింపు ఉందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు విజ్ఞప్తి మేరకు మెదక్ చర్చి అభివృద్ధికి నిధులు కేటాయించామని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానని.. సీఎం హోదాలో మళ్లీ వస్తానని అప్పట్లో మాటిచ్చానని రేవంత్రెడ్డి గుర్తుచేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లలో దళిత, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10లక్షలకు పెంచామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం వివరించారు.
ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్న సీఎం

మెదక్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత మెదక్ చర్చిలో జరిగే కార్యక్రమానికి సీఎం వెళ్లనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం వెంట పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు.