- యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు
- ఇప్పటికే యూనివర్సిటీలో ఉన్న మోహన్ బాబు, మంచు విష్ణు
- దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసుల చర్యలు
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే యూనివర్సిటీలో మోహన్ బాబు, మంచు విష్ణు ఉన్నారు. దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు యూనివర్సిటీ గేటు వద్ద వేచి ఉన్నారు.
ఇక మంచు మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకుని, రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి రోడ్డుమార్గంలో ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీకి బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు యూనివర్సిటీ పరిసరాల్లో ఎవ్వరినీ అనుమతించడం లేదు.
గేట్లను కూడా మూసివేయడంతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలేం జరుగుతుందా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, ఇటీవల మంచు ఫ్యామిలీ గొడవలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. తండ్రీకొడుకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లారు.
యూనివర్శిటీ లోపలకు వెళ్లేందుకు మనోజ్ యత్నం
అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు
తాత, నానమ్మ సమాధులు చూసేందుకు తనకు ఎవరి అనుమతి కావాలంటూ మనోజ్ ప్రశ్న
ఆ తర్వాత మనోజ్ దంపతులను అనుమతించిన పోలీసులు
సమాధులకు దండం పెట్టుకుని బయటు వచ్చిన మనోజ్
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ప్యామిలీ రచ్చ రోజురోజుకూ ముదురుతోంది. ఈరోజు మరోసారి యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీ వద్దకు వెళ్లేందుకు మంచు మనోజ్ యత్నించగా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. తన తాత, నానమ్మ సమాధులను చూసేందుకు తనకు ఎవరి అనుమతి కావాలంటూ మనోజ్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్శిటీ లోపలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ బౌన్సర్లు గొడవపడ్డారు. ఇరు వర్గాల బౌన్సర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
తనకు గొడవ చేసే ఉద్దేశం లేదని… అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని మనోజ్ ప్రశ్నించారు. లోపలకు పంపిస్తే సమాధులకు దండం పెట్టుకుని వచ్చేస్తానని చెప్పారు. ఉద్రిక్తతల మధ్యే పోలీసులు మనోజ్ ను, ఆయన భార్య మౌనికను లోపలకు పంపించారు. సమాధులకు దండం పెట్టుకున్న మనోజ్ దంపతులు యూనివర్శిటీ నుంచి బయటకు వచ్చేశారు.