- నేడు.. మధ్యాహ్నం వరకు 30 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు వెల్లడి
- మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల భక్తుల పుణ్యస్నాలు
- కుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా
ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతోన్న కుంభమేళాలో ఇప్పటి వరకు 10 కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ మేరకు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పుణ్యస్నానాలపై ప్రభుత్వం ప్రకటనను విడుదల చేసింది. గురువారం రోజున మధ్యాహ్నం వరకు 30 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలిపింది.
మకర సంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని, 1.7 కోట్ల మంది పౌష్ పౌర్ణిమ వేడుకల్లో పాల్గొన్నట్లు తెలిపింది. పండుగల వేళల్లో భక్తులు భారీగా తరలి వస్తుండటంతో పుణ్యస్నానాలు ఆచరించే ప్రదేశంలో భక్తుల సంఖ్యపై ప్రభుత్వం పరిమితులు విధించింది. మిగిలిన రోజుల్లో ఎలాంటి ఆంక్షలు అమల్లో ఉండవని వెల్లడించింది.
కుంభమేళాకు ఈసారి 45 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా భక్తులు వచ్చారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది.