ప్రజా భవన్ లో తెలంగాణ ఎంపీల సమావేశంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అంశాలపై చర్చించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
- కేంద్రం.. పెండింగ్ అంశాలను పరిష్కరించాలని పార్లమెంటులో గళం విప్పుతామన్న రామ సహాయం కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి శనివారం హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ ఎంపీల సమావేశంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడారు. మొత్తం 28 అంశాలపై చర్చలు జరిగి ప్రతిపాదనలు రూపొందించగా.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించిన కీలక అంశాలపై రఘురాం రెడ్డి ప్రస్తావన తెచ్చారు.
అందులో కొన్ని ఇలా.. - పారిశ్రామిక కేంద్రమైన కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలి. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా( ఏఏఐ ) ప్రత్యేక బృందం సర్వే కూడా పూర్తయినందున.. తదుపరి చర్యలు చేపట్టాలి.
- పాలేరు నియోజకవర్గం గుండా ప్రతిపాదించిన రెండు రైల్వే లైన్లను మార్చాలి.
- డోర్నకల్ నుంచి మిర్యాలగూడ ( జాన్ పహాడ్), గద్వాల్ బీజీ రైల్వే లైన్ అలైన్మెంట్ పున: పరిశీలించాలి.
- ప్రత్యామ్నాయంగా డోర్నకల్ – వెన్నారం, మన్నెగూడెం.. మరిపెడ, మోతె మీదుగా తుది అలైన్మెంట్ మంజూరు చేయాలి.
- ఉభయ జిల్లాల్లో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలి. ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే, కోదాడ- ఖమ్మం హైవేలకు సంబంధించి గతంలో సూచించిన సమస్యలు పరిష్కరించాలి. ఎన్ హెచ్ 65 జగ్గయ్యపేట వయా వైరా నుంచి కొత్తగూడెం వరకు జాతీయ రహదారిగా ప్రకటన చేయాలి.
- రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మేరకు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి.
- వెనుకబడిన, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలి.