- ముఖ్యమంత్రి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ యోగీ విమర్శలు
- హింసను అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో అల్లర్లు జరుగుతున్నా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మౌనంగా వున్నారంటూ యోగి ఆదిత్యనాథ్ ద్వజ మెత్తారు. లౌకిక వాదం ముసుగులో బెంగాల్లో అల్లర్లు సృష్టించే వారికి ఆమె పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అరాచకాన్ని, హింసను అదుపు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ చట్టంపై రాష్ట్రంలో హింస చెలరేగుతున్నా మమతా బెనర్జీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ముర్షిదాబాద్ వారం రోజులుగా అగ్నికీలల్లో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను ఆమె శాంతి దూతలుగా భావిస్తున్నారని, కానీ హింసకు అలవాటుపడిన వారు ఆమె మాటలను పెడచెవిన పెడతారని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే కాంగ్రెస్, సమాజ్వాది పార్టీ నేతలు ఈ విధ్వంసంపై ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని యోగి ఆదిత్యనాథ్ నిలదీశారు.