నైరుతీ రుతుపవనాలు(Monsoon) ముందుగానే వచ్చేశాయి. దక్షిణ బంగాళాఖాతంతో పాటు అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు చేరుకున్నాయి. దీంతో అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో నికోబార్ దీవుల్లో కొన్ని చోట్ల సాధారణ, మరికొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదు అయ్యింది. గడిచిన రెండు రోజుల నుంచి నికోబార్ దీవుల్లో విస్తృతంగా స్వల్ప స్థాయి వర్షం నమోదు అయ్యింది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో గత రెండు రోజుల నుంచి పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల తీవ్రత పెరిగింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ గాలి 20 నాట్ల వేగంతో వీస్తున్నది. నైరుతీ రుతుపవనాలు కదులుతున్న తీరుతో కేరళలోకి కూడా వర్షాలు ముందుగానే ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న డేటా ఆధారంగా.. మే 13వ తేదీ నాటికి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశించినట్లు స్పష్టం అవుతున్నది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాలకు కూడా నైరుతీ త్వరగా ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. రానున్న మరో 3 లేదా 4 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

next post