- ‘హరిహర వీరమల్లు’ సంగీతంపై ప్రశంసల జల్లు
- కీరవాణి అంకిత భావం గొప్పదన్న పవర్ స్టార్
- “సలసల మరిగే రక్తమే” పాట మే 21న విడుదల
- కీరవాణి బహుముఖ ప్రజ్ఞను కొనియాడిన పవన్
- ఆయనో గొప్ప కథా రచయిత కూడా అని వెల్లడి
ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణిపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రంలోని “సలసల మరిగే నీలోని రక్తమే…” అనే పాటకు కీరవాణి తన సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారని కొనియాడారు. ఈ గీతాన్ని రేపు (మే 21) విడుదల చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. “మనలోని పౌరుషం, వీరత్వం ఎప్పటికీ చల్లార కూడదని గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరినీ తట్టిలేపేలా ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ పాటను కీరవాణి తీర్చిదిద్దారు,” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనోధైర్యం కోల్పోకూడదని ఈ గీతం ఓ చురకలా అనిపించిందని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాలోని భావోద్వేగాలను అత్యున్నత స్థాయికి తీసుకెళతాయని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం కీరవాణి ఎంతగా తపించారో తాను స్వయంగా చూశానని, ‘వీరమల్లు’కి ఆయన ప్రాణం పోశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని స్పష్టం చేశారు. “మీతో మొదటి సారి పని చేస్తున్నాను, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు, అందుకు తగ్గట్టే ఉండాలి కదా” అని కీరవాణి తనతో అన్న మాటలు ఆయన అంకిత భావాన్ని తెలియ జేస్తాయని పవన్ వివరించారు.తాను కీరవాణిని కలిసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ ఉదయం జరిగిన సంభాషణ ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద శిష్యరికం చేసిన రోజుల నుంచి, దిగ్గజ గీత రచయితలు వేటూరి సుందరరామ మూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రితో తనకున్న అనుబంధం వరకు అనేక సంగీత, సాహిత్య విషయాలను కీరవాణి పంచుకున్నారని, ఆయన చెబుతుంటే సమయమే తెలియలేదని పవన్ పేర్కొన్నారు.
వయోలిన్ జంట స్వరాల వరకు నేర్చుకున్నాను
కీరవాణి వద్ద ఉన్న వయోలిన్లను చూసి వాటి గురించి మాట్లాడుకున్నామని పవన్ తెలిపారు. ఆ సమయంలో తాను కూడా ఒకప్పుడు వయోలిన్ నేర్చుకున్న సంగతి, జంట స్వరాల వరకు నేర్చుకుని మధ్యలోనే వదిలేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నానని చెప్పారు. చిదంబరనాథన్ బహూకరించిన వయోలిన్ను కీరవాణి ఎంత భద్రంగా దాచుకున్నారో తనకు చూపించారని పవన్ వివరించారు. కీరవాణికి తెలుగు కథలంటే ఎంతో ఇష్ట మని, తనకు బాగా నచ్చిన 32 కథలతో ఓ సంకలనం కూడా సిద్ధం చేసుకున్నారని పవన్ వెల్లడించారు. ఆ కథల పుస్తకాన్ని కీరవాణి తనకు బహూకరించడం చాలా ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఆ సంకలనంలో కీరవాణి స్వయంగా రాసిన రెండు కథలు కూడా ఉన్నాయని తెలిపారు. కీరవాణి కేవలం స్వరకర్త మాత్రమే కాదని, చక్కటి తెలుగు పదాలతో పాటలు రాయగల ప్రతిభావంతుడని, ఆయన రాసిన పల్లవులు గీత రచయితలకు మార్గనిర్దేశం చేస్తాయని పవన్ కొని యాడారు. తెరపై కనిపించే రెండున్నర గంటల సినిమా కోసం కీరవాణి రోజుల తర బడి, నెలల తరబడి తపన పడతారని పవన్ ప్రశంసించారు. తన సృజనాత్మక స్వరాలతో తెలుగు పాటకు ఆస్కార్ వేదికపై సముచిత స్థానం కల్పించిన ఘనత కీరవాణిదేనని ఆయన కీర్తించారు.