- కేంద్ర మంత్రి బండి సంజయ్
కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై కాంగ్రెస్ పార్టీ దర్శకత్వంలో కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్ర ధారిగా ‘చార్ పత్తా’ సినిమాను నడిపిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎలాంటి మేలు కలిగించని ఇలాంటి డ్రామాలతో సాధించేదేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, దీనిపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉండటంతో వాళ్ల దృష్టిని మళ్లించేందుకు ఇట్లాంటి ఎత్తుగడ వేస్తోందని విమర్శించారు. శనివారం కరీంనగర్లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో, చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని మధురానగర్లో, బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లెలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2014లో బీజేపీ ఇచ్చిన హామీని మోదీ నెరవేరుస్తున్నారని. అందులో భాగంగానే ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పెంచిన ధరల ప్రకారం, వడ్లకు కనీస మద్దతు ధర క్వింటాల్కు 69 రూపాయలు పెరిగిందన్నారు. పెంచిన ధరతో కలిపి సాధారణ వడ్లకు MSP 2,369 రూపాయలు, ‘ఏ’ గ్రేడ్ రకం వరి ధాన్యం ధర క్వింటాల్కు 2,389 రూపాయలైందన్నారు. యూపీఏ హయాంలో వడ్లకు కనీస మద్దతు ధర రూ.1310 ఉంటే…మోదీ హయాంలో రూ.2389 లకు పెరిగిందన్నారు. అంటే గతంలో ఇచ్చిన హామీ మేరకు MSP 81 శాతం పెంచారని పేర్కొన్నారు.