తనపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి సీతక్క… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్ల పంపిణీ విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, అవి తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ బాధ్యుడిగా ఈ ప్రచారానికి కేసీఆరే జవాబుదారీ వహించాలని ఆమె స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఫోన్లను పంపిణీ చేసింది. అయితే, ఒక్కో ఫోన్ను మార్కెట్ ధర కంటే అధిక మొత్తానికి కొనుగోలు చేసి మంత్రి కమీషన్లు తీసుకున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. దీనిపై మంత్రి ఇప్పటికే వివరణ ఇస్తూ.. ఒక్కో ఫోన్ను కేవలం రూ. 11,650కే అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు.
తప్పుడు ఆరోపణలతో కూడిన సోషల్ మీడియా పోస్టులను 48 గంటల్లోగా తొలగించాలని నోటీసుల్లో సీతక్క డిమాండ్ చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అన్నారు. నిర్ణీత సమయంలో స్పందించకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.