Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

విమానాలకు బాంబు బెదిరింపు.. ఒక్క ఫోన్ కాల్ వల్ల ఎంత నష్టమంటే..?

  • తనిఖీ చేసి తిరిగి పంపించే సరికి రూ.3 కోట్ల ఖర్చు
  • ప్రయాణికులు వేసే కోర్టు కేసుల తలనొప్పి అదనం
  • తీవ్రంగా నష్టపోతున్న విమానయాన సంస్థలు

గడిచిన వారం పది రోజుల్లో దేశీయ విమానయాన సంస్థలకు ఏకంగా 70 బాంబు బెదిరింపులు వచ్చాయి. విమానంలోనో, విమానాశ్రయంలోనో బాంబు ఉందని సోషల్ మీడియా ఖాతాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులే కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, విమానయాన సంస్థల యాజమాన్యాలు మాత్రం తలపట్టుకుంటున్నాయి. ఇలా బెదిరింపులు వచ్చిన ప్రతిసారీ భారీ మొత్తంలో ఖర్చవుతుండడమే దానికి కారణం. ఒక్కసారి విమానాన్ని ఆపడం కానీ, దారి మళ్లించడం కానీ చేస్తే ఏకంగా రూ.3 కోట్ల దాకా ఖర్చవుతోందని ఆయా కంపెనీలు వాపోతున్నాయి. 

బాంబు బెదిరింపులు వచ్చిన ప్రతిసారీ ప్రొసీజర్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏ బెదిరింపునూ అలక్ష్యం చేయడానికి వీల్లేదు. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో రిస్క్ చేయలేరు. బెదిరింపులు వచ్చినపుడు విమానం గాలిలో ఉంటే దగ్గర్లోని విమానాశ్రయంలో దింపేయాలి. రన్ వే పైన ఉంటే ఎయిర్ పోర్ట్‌కు దూరంగా తీసుకెళ్లి ప్రయాణికులను దించేసి విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే బాంబ్ స్క్వాడ్‌ను రప్పించడం, చెక్ చేయించడం తదితర వ్యవహారం ఉంటుంది.

ఇదంతా జరగడానికి ఎంతలేదన్నా రెండు మూడు గంటలు పడుతుంది. ఆ తర్వాత విమానం తిరిగి గాల్లోకి ఎగరాలంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి కావాలి. ఆ సమయానికి సదరు ఎయిర్ పోర్ట్‌కు రావాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాల షెడ్యూల్ చెక్ చేసి, అవసరమైన సర్దుబాటు చేసి ఏటీసీ అనుమతిస్తుంది. దీనికి మరికొంత ఆలస్యం జరుగుతుంది. దీనివల్ల ప్రయాణికులు ఎయిర్ పోర్ట్‌లో ఎదురుచూస్తూ ఉండాలి.

నిబంధనల ప్రకారం విమానాన్ని అర్ధాంతరంగా ఆపేస్తే ప్రయాణికులకు హోటల్ వసతి, భోజన సదుపాయాలు, ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలు ఆయా విమానయాన కంపెనీలే ఏర్పాటు చేయాలి. తనిఖీలకు, ప్రయాణికులకు చేసే ఏర్పాట్లకు అయ్యే ఖర్చుతో పాటు ఒకవేళ విమానాన్ని దారిమళ్లిస్తే ఇంధన ఖర్చు.. ఇలా అన్ని ఖర్చులు కలిసి విమానయాన సంస్థలకు తడిసిమోపెడవుతుంది. ఈ ఖర్చులకు అదనంగా ప్రయాణికులు వేసే లీగల్ కేసుల తలనొప్పి మరొకటుంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో కొందరు అంతర్జాతీయ ప్రయాణికులు కూడా ఉంటారు. కనెక్టింగ్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు హైదరాబాద్ టు ఢిల్లీ విమానంలో ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో వేరే దేశానికి వెళుతుంటారు.

ఇలాంటి ప్రయాణికులు తాము ఎక్కాల్సిన విమానం అందుకోలేరు. దీనికి కారణం హైదరాబాద్‌లో తాము ఎక్కాల్సిన విమానం ఆలస్యం కావడమేనని కోర్టుకెక్కుతారు. ఇప్పటికే ఇలాంటి చాలా కేసులను విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్నాయి. కొన్నిసార్లు అలాంటి ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఇలా ఒక్కసారి విమానానికి బాంబు బెదిరింపులు వస్తే రూ.3 కోట్ల దాకా ఖర్చవుతుందని విమానయాన సంస్థలు చెబుతున్నాయి.

Related posts

విందులో చేపలు, మాంసం పెట్టలేదని పెళ్లి రద్దు.. వరుడు షాకింగ్ నిర్ణయం

Ram Narayana

భర్త 5 రూపాయల కుర్‌కురే ప్యాకెట్ తీసుకురాలేదని.. విడాకులకు దరఖాస్తు చేసిన భార్య

Ram Narayana

ఉద్యోగంలో చేరిన రోజే రిజైన్ చేసిన వ్యక్తి!

Ram Narayana

Leave a Comment