- కోల్కతాలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ ఖాతా నుంచి డబ్బు దోపిడీ
- బ్యాంకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిన విషయం
- కేసు విచారణ కొనసాగుతోందన్న సైబర్ క్రైమ్ అధికారులు
తృణమూల్ కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీని సైబర్ నేరగాళ్లు రూ. 56 లక్షల మేర మోసం చేశారు. నకిలీ కేవైసీతో వారు ఈ నేరానికి పాల్పడ్డారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ ఖాతా నుంచి డబ్బును దోచేశారు. బ్యాంకుకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కల్యాణ్ బెనర్జీ ఖాతాకు సంబంధించిన కేవైసీని అప్డేట్ చేయడానికి మోసగాళ్లు నకిలీ పాన్, ఆధార్ కార్డులను ఉపయోగించారు. ఖాతాకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ను మార్చారు. వివరాలన్నీ మారిన తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా పలుమార్లు లావాదేవీలు నిర్వహించారు.
ఎంపీ ఖాతా నుంచి రూ. 56 లక్షలు కాజేశారు. వాటిని వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసి బంగారం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కొంత మొత్తాన్ని ఏటీఎంల ద్వారా ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది. సైబర్ నేరగాళ్ల బారిన పడిన ఆ ఎంపీ ఖాతా కొంతకాలంగా యాక్టివ్గా లేదు.
2001-2006 మధ్యకాలంలో కల్యాణ్ బెనర్జీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ఖాతాను తెరిచారు. ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే వేతనం అందులో జమ అయ్యేది. ఆ తర్వాత ఈ ఖాతా యాక్టివ్లో లేకుండా పోయింది. కొంతకాలంగా ఖాతా యాక్టివ్లో లేకపోవడంతో ఎంపీ బ్యాంకు అధికారులను సంప్రదించారు. దీంతో అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ జరుగుతోందని సైబర్ క్రైమ్ ఉన్నతాధికారులు తెలిపారు.