క్రికెట్ వార్తలు

రికార్డుల రారాజు వైభవ్.. కానీ ఇప్పటికిప్పుడు టీమిండియాకు ఆడటం కష్టమే!

  • ఇంగ్లండ్‌పై 80 బంతుల్లో 175 పరుగులతో వైభవ్ వీరవిహారం
  • ఐసీసీ నిబంధనల వల్లే సీనియర్ జట్టుకు దూరంగా వైభవ్
  • మార్చి 27 తర్వాతే అంతర్జాతీయ అరంగేట్రానికి ఛాన్స్

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడిన బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. 15 సిక్సర్లతో 175 పరుగులు చేసి రికార్డులను తిరగరాసిన ఈ 14 ఏళ్ల కుర్రాడిని వెంటనే సీనియర్ ఇండియా టీమ్‌లోకి తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. అయితే, వైభవ్‌లో ప్రతిభకు కొదవలేకపోయినా.. ఐసీసీ నిబంధనలు మాత్రం అతడికి అడ్డుగోడగా మారాయి.

అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ స్థాయి (సీనియర్) మ్యాచ్‌లు ఆడాలంటే క్రీడాకారుడికి కనీసం 15 ఏళ్లు నిండి ఉండాలి. 2011 మార్చి 27న జన్మించిన వైభవ్‌కు ప్రస్తుతం 14 ఏళ్లే. అంటే, ఈ ఏడాది మార్చి 27న 15వ పుట్టినరోజు జరుపుకున్న తర్వాతే అతడు టీమిండియా నీలి రంగు జెర్సీ ధరించేందుకు అర్హత సాధిస్తాడు. అప్పటి వరకు అతడు దేశవాళీ క్రికెట్ లేదా ఐపీఎల్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

మరోవైపు, బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు అండర్-19 వరల్డ్ కప్‌కు ఒకసారి మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. దీంతో 2028, 2030 వరల్డ్ కప్‌లకు వయసు ఉన్నప్పటికీ వైభవ్ మళ్లీ అండర్-19 జట్టులో కనిపించడు. ఇప్పటికే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అతి పిన్న వయసులో సెంచరీ బాదిన రికార్డు వైభవ్ సొంతం. అంతేకాకుండా, విజయ్ హజారే ట్రోఫీలో ఏబీ డివిలియర్స్ రికార్డును బ్రేక్ చేస్తూ కేవలం 59 బంతుల్లోనే 150 పరుగులు సాధించి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. ఈ రికార్డుల వీరుడి కోసం సెలక్టర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి తర్వాత వైభవ్ సీనియర్ జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Related posts

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్…

Ram Narayana

ఆరోసారి విశ్వవిజేతగా భారత్… అండర్19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై గ్రాండ్ విక్టరీ…

Ram Narayana

జింబాబ్వే పై రెండవ టీ 20 లో ప్రతీకారం తీర్చుకున్న టీం ఇండియా…

Ram Narayana