ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా పరిణామాలు మన దేశానికే కాకుండా ప్రపంచానికే పరీక్షగా మారాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశ ఇంధన అవసరాలు తీరేలా చూసుకోవడానికి సంబంధిత దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు.
కువైట్ యువరాజుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారని జైశ్వాల్ తెలిపారు. ఆయా దేశాలు, భాగస్వామ్య పక్షాలతో దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ చర్చల ఫలితంగా రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్ జలసంధి ద్వారా మనదేశానికి చేరుకున్నాయని తెలిపారు.
చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు పంపిణీ చేసేందుకు గాను రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్కు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర అధికారులు వెల్లడించారు.