- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ జయకేతనం
- 107 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరణ
- తల్లిదండ్రులను కలిసి ఆశీస్సులు అందుకున్న విజయ్
- విషెస్ తెలిపిన రజనీకాంత్
తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పార్టీ పెట్టిన 2 సంవత్సరాలు 2 నెలల్లోనే టీవీకేని విజయపథంలో నడిపించడం నటుడు విజయ్ కే సాధ్యమైంది. మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా… విజయ్ టీవీకే పార్టీ 107 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ (118)కు మరో 11 స్థానాల దూరంలో నిలిచిపోయినప్పటికీ, అధికార పీఠంపై కూర్చోవడం మాత్రం పక్కా.
ఇక, ఇవాళ ఫలితాల సరళి మొదటి నుంచి టీవీకే పార్టీకి అనుకూలంగానే ఉంది. కౌంటింగ్ సమయంలో తమ పార్టీ దూసుకుపోతుండడంతో తన ఆనందాన్ని విజయ్ కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. తల్లిదండ్రులను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఇతర కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. విజయ్ గెలుపు ప్రస్థానం పట్ల తండ్రి, ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్, తల్లి శోభ హర్షం వ్యక్తం చేశారు.
విజయ్ కి అభినందనలు తెలిపిన తలైవా
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీని గెలుపు మార్గంలో నడిపించిన పార్టీ అధ్యక్షుడు విజయ్ కి శుభాభినందనలు అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ విషెస్ తెలియజేశారు. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీవీకే పార్టీ సభ్యులకు అభినందనలు… అంటూ ఆయన ట్వీట్ చేశారు. 


తొలి ఎన్నికల్లోనే విజయ్ డబుల్ హిట్… పోటీ చేసిన రెండు చోట్లా గెలుపు

- తమిళనాడు రాజకీయాల్లోకి విజయ్ గ్రాండ్ ఎంట్రీ
- పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయం
- పెరంబూరులో 53 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీ
- తిరుచ్చి ఈస్ట్లో 27 వేలకు పైగా ఆధిక్యంతో గెలుపు
- డీఎంకే అభ్యర్థులపై విజయ్ ఘనవిజయం
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత దళపతి విజయ్ తన రాజకీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ఆయన, పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించి తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. పెరంబూరు, తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానాల నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
వివరాల్లోకి వెళితే, పెరంబూరు నియోజకవర్గంలో విజయ్ తన సమీప ప్రత్యర్థి, డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్పై ఏకంగా 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజయ్కు 1,20,365 ఓట్లు రాగా, శేఖర్కు కేవలం 66,650 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ పీఎంకే అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.
అదేవిధంగా, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గంలోనూ విజయ్ విజయ పరంపర కొనసాగించారు. ఇక్కడ డీఎంకే అభ్యర్థి ఎస్. ఇనిగో ఇరుదయరాజ్పై 27,416 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ స్థానంలో విజయ్కు 91,381 ఓట్లు, ఇరుదయరాజ్కు 63,965 ఓట్లు లభించాయి. అన్నాడీఎంకే అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ మేరకు తన విజయాలపై విజయ్ ఎన్నికల అధికారి నుంచి సర్టిఫికెట్లు అందుకున్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే రెండు చోట్ల గెలవడం ద్వారా, దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీలకు విజయ్ గట్టి పోటీ ఇవ్వనున్నారనే సంకేతాలు పంపారు.