- బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దుపై తీవ్ర వ్యతిరేకత
- తొలిరోజు ట్రంప్ సంతకం.. మరుసటి రోజే కోర్టులో దావా
- అమలు చేయడం కష్టమేనంటున్న నిపుణులు
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తొలిరోజు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ‘బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దు’ కీలకమైంది. అయితే, దీనిపై అమెరికా వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏకంగా 22 రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటానికి సిద్దమయ్యాయి. ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే దానిని సవాలు చేస్తూ కోర్టులో దావాలు వేశాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా సహా మొత్తం 22 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయంపై మండిపడుతున్నాయి.
ఈ వ్యవహారంపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ స్పందిస్తూ.. అమెరికా రాజ్యాంగం ప్రకారం యూఎస్ఏలో జన్మించిన వారికి పుట్టుకతోనే పౌరసత్వం లభిస్తుందని చెప్పారు. 14వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని జన్మహక్కుగా మార్చారని వివరించారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ట్రంప్ తన పరిధిని దాటారని ఆరోపించారు. కాగా, జన్మత: లభించే ఈ పౌరసత్వ హక్కును మార్చడం అంత సులభం కాదని అమెరికా రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. అయితే, ఇప్పటికే 22 రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న కారణంగా రాజ్యాంగ సవరణ చేయడం కష్టమని అభిప్రాయపడ్డారు.
ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగులందరినీసెలవుపై వెళ్లిపోవాలని ఆదేశాలు!

- ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్క్లూజన్ సిబ్బందిని సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు
- త్వరలోనే ఆ ఉద్యోగులందరికీ లేఆఫ్లు ప్రకటించే అవకాశం
- డీఈఐ సంబంధిత శిక్షణ కార్యాక్రమాలను తక్షణమే ముగించాలని ఏజెన్సీలకు సూచన
- ఈ విభాగాలు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఆదేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్క్లూజన్ (డీఈఐ) సిబ్బంది అందరినీ సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. త్వరలోనే వారందరికీ లేఆఫ్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా (అమెరికా కాలమానం ప్రకారం) వారందరినీ వేతనంతో కూడిన సెలవుపై పంపించాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు అందాయి. ఈ విభాగాలకు చెందిన అన్ని వెబ్ పేజీలను కూడా ఈ గడువులోగా పూర్తిగా తొలగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
అలాగే డీఈఐ సంబంధిత శిక్షణ కార్యాక్రమాలను తక్షణమే ముగించాలని ఏజెన్సీలకు సూచించారు. ఈ విభాగాలు చేసుకున్న ఒప్పందాలను కూడా క్యాన్సిల్ చేయాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే కొన్ని వెబ్ సైట్లను అధికారులు తొలగించారు.
కాగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు షాకింగ్ నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే జన్మత: పౌరసత్వం రద్దు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి యూఎస్ఏ ఎగ్జిట్, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ వంటి నిర్ణయాలతో ట్రంప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.