జాతీయ వార్తలు

ముగిసిన అయ్యప్ప దర్శనం- శబరిమల ఆలయం మూసివేత దర్శించుకున్న 53 లక్షల మంది భక్తులు

ముగిసిన అయ్యప్ప దర్శనం- శబరిమల ఆలయం మూసివేత దర్శించుకున్న 53 లక్షల మంది భక్తులు

: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మండలపూజ, మకరవిలక్కు సీజన్ వైభవంగా ముగిసింది. దీంతో ఆలయాన్ని సోమవారం ఉదయం మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు(టీడీబీ) అధికారులు తెలిపారు. 2024-25 తీర్థయాత్ర సీజన్‌లో భక్తులు భారీ సంఖ్యలో అయ్యప్పను దర్శించుకున్నారని వెల్లడించారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆలయాన్ని మూసివేశామని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

ఆలయానికి పోటెత్తిన భక్తులు
శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్‌లో భక్తులు పోటెత్తారు. రోజుకు లక్షలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. మొత్తం 53 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్ బోర్డు తెలిపింది. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి, తూర్పు మండపంలో గణపతి హోమం చేశామని వెల్లడించింది. ఆ తర్వాత మేల్శాంతి అరుణ్ కుమార్ నంబూద్రి అయ్యప్ప విగ్రహానికి విభూతాభిషేకం నిర్వహించి, దానిని రుద్రాక్షలతో అలంకరించారని ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు పేర్కొంది.

‘హరివరాసనం’ పారాయణం తర్వాత మేల్శాంతి ఆలయ దీపాలను ఆర్పి గర్భగుడిని అధికారికంగా మూసివేశారని టీడీబీ ప్రకటించింది. ఆపై ఆలయ తాళాలను రాజకుటుంబ సభ్యుడికి అప్పగించినట్లు వెల్లడించింది. “18 పవిత్ర మెట్లు దిగిన తర్వాత సంప్రదాయ వేడుకలు పూర్తయ్యాయి. పందలం రాజకుటుంబ సభ్యుడు, దేవస్వమ్ ప్రతినిధులు, మేల్శాంతి సమక్షంలో ఆలయ తాళాలను శబరిమల పరిపాలనాధికారి బిజు వీ నాథ్‌కు ఇచ్చారు. ఆ తర్వాత రాజ ప్రతినిధి, అయన పరివారం పండలం ప్యాలెస్‌కు బయలుదేరారు. తిరువాభరణం ఊరేగింపు జనవరి 23న పండలం చేరుకోనుంది” అని టీడీబీ పేర్కొంది.

శబరిమలలో సోలార్ విద్యుత్ ప్లాంట్
అలాగే శబరిమలలో సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రపంచంలోనే పూర్తిగా సౌరశక్తితో నడిచే మొదటి విమానాశ్రయంగా ప్రసిద్ధి చెందిన కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (సీఐఏఎల్) సాంకేతిక సహకారంతో ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ విషయంపై టీడీబీ అధికారులు ఆదివారం సన్నిధానంలో సీఐఏఎల్ ఎండీ సుహాస్‌ చర్చించారు. శబరిమలలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై ప్రాథమిక చర్చలు జరిపామని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. సీఎస్ఆర్ నిధులను ఉపయోగించి సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టీడీబీ యోచిస్తోందని పేర్కొన్నారు.

Related posts

ఇన్‌స్టా రీల్ కోసం ఫ్లైఓవర్‌పై కారును ఆపిన వ్యక్తి.. రూ.36,000 జరిమానా విధించిన పోలీసులు

Ram Narayana

హర్యానాలో హింస.. రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో నలుగురి మృతి!

Ram Narayana

మీడియా గొంతును నులిమే చట్టం తేబోతున్న బీజేపీ సర్కార్…

Ram Narayana