- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
- త్వరలో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కసరత్తు
- రూ. 9 వేల కోట్లతో యువతకు స్వయం ఉపాధి
కోరి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన కోసం ప్రజా ప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. 5 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మధిర పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ లో సోమవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మూడంచెల వ్యూహం అమలులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రక్షాళన చేసి జాబ్ కేలండర్ విడుదల చేసామని, మొదటి దశలో ప్రజా ఖాళీగా ఉన్న 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందని చెప్పారు. రెండవ దశలో బహుళ జాతి సంస్థలకు రాష్ట్రంలో అవసరమైన వనరులు కల్పించి, వీటి ద్వారా యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. మూడవ దశలో ఉపాధిని ప్రోత్సహించేందుకు 9 వేల కోట్ల పెట్టుబడితో రాజీవ్ యువ వికాసం పథకం క్రింద యువతకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 న స్వయం ఉపాధి యూనిట్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. స్వయం ఉపాధి కోసం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించామని పేర్కొన్నారు. యువత రాష్ట్రానికి గొప్ప వనరని, రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు, కుటుంబ బాగు కోసం, సమాజానికి పెద్ద ఎత్తున యువత ఉపయోగపడాలని ఆయన కోరారు. ఖాళీగా ఉండే యువత సంఘ విద్రోహ శక్తులకు, మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని, చివరి వయసులో తల్లిదండ్రులను బాధపడకుండా చూసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని యువతకు అవసరమైన స్కిల్స్ అందించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటిఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా అప్ గ్రేడ్ చేసిందని చెప్పారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించాలనే ఆలోచనతో 60 యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి ఒకేసారిరూ. 11 వేల 600 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. ఈ పాఠశాలల ద్వారా నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్య ఉచితంగా అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, సింగరేణి జనరల్ మేనేజర్ సాలీం రాజు తదితరులు పాల్గొన్నారు.
