అంతర్జాతీయం

లాస్ ఏంజెలెస్‌లో ఉద్రిక్తత : ఫెడరల్ బలగాల మోహరింపుపై ట్రంప్ .. గవర్నర్ మధ్య తీవ్ర వాగ్వాదం

  • లాస్ ఏంజెలెస్‌లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ దాడులతో ఉద్రిక్తతలు
  • అల్లర్లను అణిచివేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
  • 2000 మంది సైనికుల మోహరింపు
  • కాలిఫోర్నియా నేషనల్ గార్డ్‌పై కేంద్రం పట్టు
  • హింసను రెచ్చగొట్టడమేనని గవర్నర్ న్యూసమ్ ఫైర్
  • కేంద్రం చర్యలను తీవ్రంగా ఖండించిన పౌర హక్కుల సంఘాలు
  • లాస్ ఏంజెలెస్‌లో శాంతి భద్రతలకు ఢోకా లేదంటున్న స్థానిక అధికారులు

ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ దాడుల కారణంగా గత కొన్ని రోజులుగా అట్టుడుకుతున్న లాస్ ఏంజెలెస్‌లో ‘అల్లరి మూకలను అణిచివేస్తామని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. అయితే, కాలిఫోర్నియా నేషనల్ గార్డ్‌ను ఫెడరల్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం, నగరానికి 2,000 మంది సైనికులను పంపడం హింసను ప్రేరేపించడానికి పన్నిన రాజకీయ స్టంట్ అని కాలిఫోర్నియా గవర్నర్ గేవిన్ న్యూసమ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

“కాలిఫోర్నియా గవర్నర్ గేవిన్ న్యూస్కమ్, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్‌కు తమ పనులు చేతకాకపోతే అప్పుడు ఫెడరల్ ప్రభుత్వం రంగంలోకి దిగి అల్లర్లు, దోపిడీదారుల సమస్యను పరిష్కరించాల్సిన విధంగా పరిష్కరిస్తుంది!” అని ట్రంప్ హెచ్చరించారు. దీనిపై గవర్నర్ న్యూసమ్ కూడా అంతే తీవ్రంగా స్పందించారు. ఫెడరల్ ప్రభుత్వం కాలిఫోర్నియా నేషనల్ గార్డ్‌ను తమ నియంత్రణలోకి తీసుకుని, 2,000 మంది సైనికులను లాస్ ఏంజెలెస్‌లో మోహరించడం ప్రమాదకరమని, రాజకీయ ప్రేరేపిత చర్య అని  ఆరోపించారు. “క్షేత్రస్థాయిలో పోలీసుల కొరత లేకపోయినా ఫెడరల్ ప్రభుత్వం ఇలా చేయడం కేవలం ప్రదర్శన కోసమే. వారికి ఆ అవకాశం ఇవ్వకండి. హింసను ఎప్పుడూ ఆశ్రయించవద్దు. శాంతియుతంగా మీ గళం వినిపించండి” అని న్యూసమ్ ‘ఎక్స్’ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు.

ఫెడరల్ ప్రభుత్వ చర్య ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఉందని, ఇది ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తుందని గవర్నర్ న్యూసమ్ అంతకుముందు హెచ్చరించారు. “లాస్ ఏంజెలెస్ అధికారులకు అవసరమైన వెంటనే పోలీసు సహాయం అందుబాటులో ఉంది. మేము నగరం, కౌంటీ అధికారులతో నిరంతర సమన్వయంతో ఉన్నాం. ప్రస్తుతం తీర్చలేని అవసరం ఏదీ లేదు. నేషనల్ గార్డ్ ఇప్పటివరకు లాస్ ఏంజెలెస్‌కు అద్భుతంగా సేవలు అందించింది. ఇది తప్పుడు చర్య, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఫెడరల్ ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఇమిగ్రేషన్ తనిఖీలు నిర్వహిస్తోందని, ఈ నేపథ్యంలో లాస్ ఏంజెలెస్ హైవేలపై శాంతి భద్రతలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సీహెచ్‌పీ (కాలిఫోర్నియా హైవే పెట్రోల్) బలగాలను మోహరిస్తోందని న్యూసమ్ తెలిపారు. “ఫెడరల్ ఇమిగ్రేషన్ దాడులకు సాయం చేయడం వారి పని కాదు. ఫెడరల్ ప్రభుత్వం ఉద్రిక్తతలను పెంచడానికి గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఏ నాగరిక దేశం ఇలా ప్రవర్తించదు” అని ఆయన విమర్శించారు.

లాస్ ఏంజెలెస్‌లోని అనేక ప్రాంతాల్లో పత్రాలు లేని నివాసితులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున చేపట్టిన ఇమిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ దాడులు జాతి వివక్షతో కూడుకున్నవని, అనవసరంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారని పౌర హక్కుల సంఘాలు, వలసదారుల మద్దతుదారులు తీవ్రంగా ఖండించారు. ఫెడరల్ ఏజెంట్లతో జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడినట్లు వార్తలు వస్తుండగా, డజన్ల కొద్దీ నిరసనకారులను అరెస్టు చేశారు. నగరంలో పోలీసు బలగాల కొరత లేదని, ఫెడరల్ జోక్యం అనవసరమని, రెచ్చగొట్టేదిగా ఉందని స్థానిక అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Related posts

యూకే కొరడా.. 20,000 మంది భారతీయుల భవితవ్యం ప్రశ్నార్థకం!

Ram Narayana

భారత్, చైనా మధ్య కీలక ముందడుగు..వాణిజ్య మార్గాలు పునఃప్రారంభం!

Ram Narayana

ఏఐ సాయంతో 2020లో ఇరాన్ అణు శాస్త్రవేత్త హత్య .. మర్డర్ మిస్టరీ

Ram Narayana