- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రోస్టేట్ క్యాన్సర్
- ప్రారంభ దశలోనే గుర్తించానన్న నెతన్యాహు
- ఇటీవల చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడి
- ఇరాన్తో యుద్ధం వల్లే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచానని స్పష్టం
- ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు నెతన్యాహు ప్రకటన
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ సోకిందని, ప్రారంభ దశలో ఉన్నప్పుడే దానికి విజయవంతంగా చికిత్స తీసుకున్నానని అధికారికంగా వెల్లడించారు. ఇరాన్తో యుద్ధం జరుగుతున్నందున తన అనారోగ్య విషయాన్ని ఇంతకాలం గోప్యంగా ఉంచినట్లు శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
ఏడాదిన్నర క్రితం ప్రోస్టేట్ గ్రంథి సమస్యకు శస్త్రచికిత్స చేయించుకున్నానని, అప్పటి నుంచి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నానని నెతన్యాహు తెలిపారు. ఇటీవలి పరీక్షలో 0.9 సెం.మీ. పరిమాణంలో ఓ కణితిని గుర్తించారని, అది ప్రారంభ దశ క్యాన్సర్గా నిర్ధారణ అయిందని వివరించారు. అయితే అది ఇతర భాగాలకు వ్యాపించలేదని, వైద్యుల సలహా మేరకు రేడియేషన్ థెరపీ తీసుకున్నానని చెప్పారు. ఈ చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా తొలగిపోయిందని వైద్య నివేదికలు ధృవీకరించినట్లు పేర్కొన్నారు.
తన ఆరోగ్య సమస్యను ఆసరాగా తీసుకుని ఇరాన్ తప్పుడు ప్రచారం చేసే ప్రమాదం ఉందని, అందుకే యుద్ధ సమయంలో ఈ విషయాన్ని బయటపెట్టలేదని నెతన్యాహు వివరించారు. “వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించుకోవడం నాకు అలవాటు. ఈ విషయంలోనూ అదే చేశాను” అని ఆయన తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
76 ఏళ్ల నెతన్యాహు, ఇజ్రాయెల్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. తన వార్షిక వైద్య నివేదిక విడుదల సందర్భంగా ఈ వివరాలను ఆయన వెల్లడించారు. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడంతో ఆయన పూర్తిగా కోలుకున్నారని వైద్యులు స్పష్టం చేశారు.