విద్య,వైద్యానికి తొలి ప్రాధాన్యం …సీఎం రేవంత్ రెడ్డి
తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత విద్యా, వైద్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. 7 వేల 750 మంది నర్సులకు నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఏడాదిలోపు వైద్యశాఖలో 14 వేల ఉద్యోగాల భర్తీ చేశామని చెప్పారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వైద్యశాఖలో ఉద్యోగాలు భర్తీ చేయలేదని అన్నారు. వైద్యశాఖ బలోపేతం అయితేనే తెలంగాణ సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో సోమవారం ప్రజాపాలన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రజాపాలన వేడుకల్లో భాగంగా 213 అంబులెన్స్లను ప్రారంభించారు. ఇందులో 108 కోసం 136 అంబులెన్స్లు, 102 కోసం 77 అంబులెన్స్లు ఉన్నాయి. 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు నియామక పత్రాలు అందజేశారు. అదే విధంగా 33 ట్రాన్స్జెండర్ క్లినిక్లను, 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలు వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ సహ పలువురు నాయకులు పాల్గొన్నారు.