- ఫోర్త్ సిటీ పేరుతో రూ. 50 వేల కోట్ల దోపిడీకి రేవంత్ రెడ్డి కుట్ర
- కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు
నేషనల్ హెరాల్డ్ ద్వారా దేశ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణ చేశారు. రూ. 2 వేల కోట్ల ప్రభుత్వ సంపదను కాజేసేందుకు సోనియాగాంధీ ప్రయత్నించారని ఆరోపించారు. ఈ కేసు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటిది కాదని, 2011లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే సీబీఐ దర్యాప్తు మొదలయిందని చెప్పారు. ఆ సమయంలోనే సోనియా, రాహుల్ బెయిల్ పొందారని తెలిపారు. ఈ కేసుతో బీజేపీకి సంబంధం లేదని అన్నారు. తప్పు చేసిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని అన్నారు. యంగ్ ఇండియా పేరుతో నెహ్రూ కుటుంబం రూ. 2 వేల కోట్లు దోచుకున్నారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ పేరుతో రూ. 50 వేల కోట్ల దోపిడీకి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఇక్కడి పేదల ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో నెహ్రూ కుటుంబం కూడా అదే పేరుతో కొల్లగొట్టిందని అన్నారు.